అమరావతి : ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు భాష వాడకంపై. తెలుగు కేవలం భాష కాదని, అది మన జీవన సంస్కృతి అని స్పష్టం చేశారు. చందమామను చూపే రోజులు పోయి సెల్ ఫోన్లు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారంటూ వాపోయారు. పల్లెల్లో పండుగల వాతావరణం కనుమరుగు అవుతోందని ఆవేదన చెందారు స్పీకర్. తెలుగు మహాసభల తీర్మానాలను అసెంబ్లీలో చర్చించి అమలు చేస్తామని ప్రకటించారు. తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానం అన్నారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న ‘3వ ప్రపంచ తెలుగు మహాసభల’ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నేటి తరం పిల్లలకు మన ఆచారాలు, సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమ్మలు చందమామను చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపించేవారని, కానీ నేడు సెల్ ఫోన్లను చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి దాపురించిందన్నారు. అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో, జరుపుకునే పండుగల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని గుర్తు చేశారు. గ్రామాల్లో ఒకప్పుడు సంక్రాంతి, దసరా, ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలు వస్తే పండగ వాతావరణం ఉట్టి పడేదని అన్నారు. హరిదాసులు, గంగిరెద్దులతో సందడిగా ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ నేడు గ్రామాల్లో ఆ కళ కనుమరుగు అవుతోందన్నారు స్పీకర్ అచ్చెన్నాయుడు.


















