బెంగళూరు | బళ్లారి హింసాకాండపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. శనివారం ఆయన మీడియాతో బెంగళూరులో మాట్లాడారు. ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉంటూ లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించాల్సిన ఎస్పీ బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించారని అన్నారు. అందుకే తనను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు సీఎం. దీనిపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు సిద్దరామయ్య. ఇదిలా ఉండగా బళ్లారిలో వాల్మీకి కటౌట్ ను పెట్టేందుకు గాను గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సదరు బాధిత కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తది కావడం గమనార్హం.
దీంతో ఘటన జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తతను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక పూర్తిగా కాంగ్రెస్ పార్టీ , సర్కార్ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర. తక్షణమే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బళ్లారి హింసాకాండపై మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో నిందితులుగా ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి బి. శ్రీరాములు కూడా ఉన్నారు.















