కరీంనగర్ జిల్లా : వర్కర్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతి పండుగ లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. లేకపోతే సిరిసిల్లో 10 వేల మందితో మహా ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉద్దేశ పూర్వకంగా తాత్సారం చేస్తూ, పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర నుంచి మేల్కొని, సంక్రాంతి లోపలే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రారంభించాల్సిందే అని స్పష్టం చేశారు.
ఈ పథకం సమర్థవంతంగా అమలవ్వాలంటే, గతంలో రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పవర్ లూమ్లను సబ్సిడీపై కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్లో పూర్తిస్థాయిలో కేటాయించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అలాగే సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలి అని కోరారు. ఒకవేళ సంక్రాంతి లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయక పోతే, సంక్రాంతి అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ, నేత కార్మికులందరినీ సమీకరించి ఆందోళనకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు.















