డిండి : డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎర్రవెల్లి – గోకారం నిర్వాసితుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం బాధితులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. గోదావరి ప్రాజెక్ట్ మీద మనం చాలా ప్రాజెక్ట్ లను కట్టుకుంటూ పోయామన్నారు. అదే విధంగా కృష్ణానది ద్వారా 25 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తి చేసి ఉంటే చాలా పొలాలకు నీళ్లు వచ్చేవన్నారు. కానీ కనీసం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయ లేదన్నారు. సంపూర్ణంగా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు కల్వకుంట్ల కవిత. మనకు ఇబ్బందులు తగ్గాలంటే ఇంకా నీళ్లు ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కానీ డిండి ప్రాజెక్ట్ కింద ప్రపోజ్ చేసిన గోకారం చెరువు అంశాన్ని మాట్లాడు కోవాలన్నారు. గోకరాంలో 9 వందల ఎకరాలు, ఎర్రవెల్లి లో 6 వందల ఎకరాలు ప్రపోజ్ చేశారని తెలిపారు. కానీ 15 వందల ఎకరాల భూమి తీసుకుంటే 2 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తాయన్నారు. గోకరాం చెరువునే మరింత పటిష్టం చేస్తే ఆ నీళ్లను చెరువు ద్వారానే తీసుకోవచ్చని అన్నారు కల్వకుంట్ల కవిత. ఇలాంటి అవకాశం ఉన్నా గతంలో బీఆర్ఎస్ సర్కార్, ఇప్పుడు అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు . ఇక్కడి ప్రజలు తమ నిరసనగా సర్పంచ్ ఎన్నికలను బాయ్ కాట్ చేశారని అన్నారు. అయినా సరే ఇక్కడి ఎమ్మెల్యే గానీ ప్రతిపక్షాలు గానీ స్పందించక పోవడం దారుణమన్నారు. కనీసం ఎన్నికల కమిషనర్ కూడా స్పందించక పోవటం విడ్డూరంగా ఉందన్నారు.


















