అమరావతి : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ ప్రవేశ పెట్టిన సంస్కరణలే దేశం అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశానికి వాజ్ పేయి సుపరిపాలన పరిచయం చేశారని కొనియాడారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో వాజ్పేయి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అంతక ముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. డిసెంబర్ 25 ఒక చారిత్రాత్మక రోజు అని, యుగ పురుషుడు వాజ్ పేయి పుట్టిన రోజు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘వాజ్పేయి శత జయంతిని దేవతల రాజధాని ప్రజా రాజధానిలో నిర్వహించు కోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉండేలా రాజధాని నిర్మిస్తున్నాం అన్నారు.
ఇందుకు సహకరిస్తున్న రైతులను అభినందిస్తున్నానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఒక్క రూపాయి తీసుకోకుండా రాజధానికి 34 వేల ఎకరాల భూమిని రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దేశం గర్వించే నేత, అరుదైన నాయకుడు వాజ్పేయ్. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు రాజధానిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కోరారు. చరిత్ర గుర్తుంచుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పామన్నారు. ఈ నెల 11 నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్రను బీజేపీ చేపట్టింది. 26 జిల్లా కేంద్రాల్లో వాజ్ పేయ్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. మూడు పార్టీల నేతలంతా కలిసి అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేశారు. ఆయన చరిత్ర, చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తుండేలా స్మృతీవనం ఏర్పాటు చేస్తాం’ అని సీఎం అన్నారు.


















