అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తమ సర్కార్ చేస్తున్న ప్రయత్నాల వల్ల భారీ ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. ఇప్పటికే 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టారన్నారు. అంతే కాకుండా రెండు నగరాలు ప్రపంచంలో కీలకంగా మారబోతున్నాయని చెప్పారు. బుధవారం నారా చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలోనే దేశంలోనే ఏపీ సెంటర్ పాయింట్ కాబోతోందన్నారు. ఇందులో భాగంగా బిగ్ డేటా సెంటర్ గా విశాఖపట్నం, క్వాంటమ్ హబ్ గా అమరావతి మారబోతున్నాయని చెప్పారు.
బలమైన సబ్సీ కేబుల్ కనెక్టివిటీ విశాఖపట్టణాన్ని ప్రపంచ డేటా పర్యావరణ వ్యవస్థలో నిలబెడుతుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే క్రమంలో అమరావతి భారతదేశపు క్వాంటం వ్యాలీగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు తిరుపతి అంతరిక్ష నగరంగా మారుతుందన్నారు సీఎం. ఇదే క్రమంలో అనంతపురం, కడప ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ హబ్లుగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ డేటా సెంటర్ ను తమ కృషి ఫలితంగా విశాఖలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదన్నారు. గూగుల్ ఇక్కడికి రావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేశారని చెప్పారు.

















