హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పై సీరియస్ కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. రామచందర్ రావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోల్పోతున్న పార్టీ ప్రతిష్టను తిరిగి ఎలా పెంపొందించు కోవాలనే ఉద్దేశంతోనే తమపై , పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమ బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనా కాలంలో ఏం చేశారో ప్రజలంతా చూశారని అన్నారు. అందుకే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని అయినా తన తీరు మార్చుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు రాంచందర్ రావు. రోజు రోజుకు దేశంలోనే కాదు ప్రధానంగా తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున బలపడుతోందని అన్నారు.
దీనిని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. దీనిని ఎవరూ హర్షించరని పేర్కొన్నారు. బీజేపీ ఎదుగుదలకు భయపడి చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ పూర్తిగా పచ్చి అబద్దాలని సంచలన వ్యాఖ్యలు చేశారు రామచందర్ రావు. అంతే కాకుండా నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రజలకు చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలని అన్నారు. కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిందలు వేసి, మమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించారని కానీ జనం నమ్మరని అది గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలకు హితవు పలికారు.
















