ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక సర్కార్ అనుసరిస్తున్న విధానంపై. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించేలా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న ఆయన ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. తక్షణమే నిలిపి వేయాలని సూచించారు. లేకపోతే తాము తీవ్ర అభ్యంతరం తెలియ చేయాల్సి వస్తుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల మధ్య సత్ సంబంధాలు కలిగి ఉండాలన్నారు. కానీ ఇలా కొట్లాడుకునే విధంగా ఉండ కూడదని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్తో జరిగిన సమావేశంలో నాయిడు ఈ విషయాన్ని లేవనెత్తారు. రాష్ట్ర జల భద్రతకు కీలకమైన ప్రధాన నీటిపారుదల , తాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కేంద్రం చురుకైన మద్దతును కూడా ఆయన కోరారు.
అల్మట్టి డ్యామ్ విస్తరణ కోసం కర్ణాటక భూసేకరణ ప్రారంభించడంపై ఆందోళన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. చట్టపరమైన, అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యే వరకు పొరుగు రాష్ట్రాన్ని ముందుకు సాగకుండా నిరోధించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని అభ్యర్థించారు. కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదన పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. సాగు నీటి ప్రయోజనాల విషయంలో తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఒంటెద్దు పోకడ పోతోందని మండిపడ్డారు. ఇందు కోసం కేంద్రమే రంగంలోకి దిగాలని , వెంటనే ఆల్మట్టి డ్యాం విస్తరణ పనులు నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.
















