హైదరాబాద్ : కాదేదీ మోసానికి అనర్హం అంటూ మోసగాళ్లు అందినంత మేర దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగాక సైబర్ నేరాలు పెరిగి పోయాయి. ఇప్పటికే ఆన్ లైన్ గేమ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, అప్పులు తీర్చలేక పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు శుక్రవారం సంచలన వివరాలు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించి ఉద్గమ్ (UDGAM) పోర్టల్ పేరును వాడుకుని మోసానికి పాల్పడుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకపోతే ఉన్న డబ్బులు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు సీపీ.
క్లెయిమ్ చేయని డిపాజిట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దని ప్రజలను కోరారు . ఈ స్కామ్లో ప్రజలు పాత బ్యాంకు ఖాతాలలో పెద్ద మొత్తంలో క్లెయిమ్ చేయని డిపాజిట్లు కలిగి ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ అనుమానాస్పద లింక్ పంపిస్తారని, దీనిని క్లిక్ చేయడం ద్వారా డబ్బును ఉప సంహరించుకోవచ్చని చెప్పే సందేశాలతో పాటు ఈమెయిల్స్ కూడా ఉంటాయన్నారు. ఉద్గమ్ అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు – గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ను తప్పుగా ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు వీసీ సజ్జనార్. లింక్పై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ ఫోన్లు హ్యాక్ చేయబడి, నిమిషాల్లోనే బ్యాంకు ఖాతాలు ఖాళీ కావచ్చని హెచ్చరించారు.
















