హైదరాబాద్ : ఆంధ్రా ప్రాంతానికి చెందిన గీతం యూనివర్శిటీ నిర్వాకంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. డీమ్డ్ యూనివర్శిటీ హోదా పొందిన సదరు యూనివర్శిటీ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది. యధేశ్చగా నెల నెలా కరెంట్ ను వాడుకుంటోంది ఈ విశ్వ విద్యాలయం. తీరా కరెంట్ బిల్లులు కట్టకుండా తాత్సారం చేస్తోంది. ఈ విషయంపై టీఎస్పీడీసీఎల్ ఏకంగా నోటీసులు జారీ చేసింది. సదరు యూనివర్శిటీ విద్యుత్ సంస్థకు రూ. 118 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం , బిల్లులు కట్టకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది విద్యుత్ సంస్థ. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. విచిత్రం ఏమిటంటే గీతం యూనివర్శిటీ గత 2008 నుంచి కరెంట్ బిల్లులు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తూ వస్తోంది.
బిల్లులు చెల్లించక పోగా పైగా తమకు ఎలా నోటీసులు ఇస్తారంటూ గీతం యూనివర్శిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. ఇంతకాలం బిల్లులు వసూలు చేయకుండా ఎందుకు వెసులుబాటు ఇచ్చారని ప్రశ్నించింది విద్యుత్ సంస్థను హైకోర్టు. సామాన్యులు రూ.1000 బిల్లు చెల్లించకున్నా కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడింది. మరి గీతం యూనివర్శిటీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి TSPDCL అధికారులు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో బిల్లులు చెల్లించకుండా ఉన్న గీతం యూనివర్శిటీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
















