న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. పార్లమెంట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు దేవెగౌడ. ఒకవేళ అలా జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలకు చెందిన వారు ఎంపీలుగా ఎలా గెలిచారంటూ ప్రశ్నించారు. ఒకవేళ ఓట్ల చోరీ జరిగితే వారు కూడా ఓడి పోవాల్సి ఉండేది కాదా అని అన్నారు మాజీ దేశ ప్రధానమంత్రి.
తాము కూడా ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందని చెప్పారు. కానీ తాము ఏ ప్రధానమంత్రిని గానీ, ప్రభుత్వ సంస్థను గానీ ఎప్పుడూ అపహాస్యం చేయలేదని అన్నారు హెచ్ డి దేవెగౌడ. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో 400 సీట్లు వచ్చినప్పుడు కూడా తాము మౌనంగా ఉన్నామే తప్పా ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయలేదన్నారు మాజీ ప్రధానమంత్రి. ‘ఓట్ల దొంగతనం’ వంటి నినాదాలు చేస్తూ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందన్నారు. మీరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. వారి మనస్సులలో అనుమానాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు హెచ్ డి దేవెగౌడ .
















