అమరావతి : ఏపీ పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. 700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్ లు ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని భూమిలో వచ్చాయని తెలిపారు. అలాంటి రైతులకు ఫోన్ లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామని పేర్కొన్నారు మంత్రి.
చాలా మంది రైతులు ల్యాండ్ అక్విజిషన్ తర్వాత అవే ప్లాట్ లు తీసుకుంటామని చెప్పారని అన్నారు.
37 మంది రైతులు వేరే చోట ప్లాట్ లు కేటాయించమని అడిగారని చెప్పారు నారాయణ పొంగూరు. జరీబు, గ్రామ కంఠం ప్లాట్ లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. ఇంకా కేవలం 7628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు పొంగూరు నారాయణ. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ఆర్5 జోన్ పై న్యాయ సలహా తీసుకుంటున్నామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. గత ప్రభుత్వం అమరావతిని పట్టించుకోలేదని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేశారని జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు. త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
















