మహారాష్ట్ర : మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి, లోక్ సభ స్పీకర్ గా పని చేసిన శివ రాజ్ పాటిల్ కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. కొద్దికాలం ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ ఉన్నారు. శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. శివ రాజ్ పాటిల్ మహారాష్ట్ర లోని లాతూర్ లోని తన స్వంత నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. ఆయనకు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. 2004 నుండి 2008 వరకు అప్పటి దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేశారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కీలక మంత్రిగా ఉన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేశారు. ఇక కెరీర్ పరంగా చూస్తే శివ రాజ్ పాటిల్ 1991 నుండి 1996 వరకు 10వ లోక్ సభ స్పీకర్ గా సమర్తవంతంగా బాధ్యతలు చేపట్టారు. 2010 నుండి 2015 వరకు పంజాబ్ గవర్నర్ గా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్గా కూడా పాటిల్ పని చేశారు. ఇదిలా ఉండగా ప్రజా జీవితంలో తన సుదీర్ఘ సంవత్సరాలలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా పని చేసిన గొప్ప నాయకుడిని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
















