హైదరాబాద్ : నాలుగున్నర కోట్ల ప్రజల బతుకులు మార్చేందుకే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ విజన్ 2047 ను రూపొందించడం జరిగిందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష అని ప్రకటించారు. కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిదని, కానీ నాకు పేదరికం ఏంటో తెలుసు అని అన్నారు. తాను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఇక్కడి దాకా వచ్చానని అన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉందన్నారు. ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన అని అన్నారు సీఎం. విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అని చెప్పారు.
దీనిని మేం ఖర్చుగా భావించడం లేదని, ఇది తెలంగాణ భవిష్యత్ కు పెట్టుబడిగా భావిస్తున్నాం అని అన్నారు. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.
ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించడం జరిగిందని అన్నారు.
తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించామన్నారు. అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. ఈ డాక్యుమెంట్ తయారీలో NITI Aayog కీలక భూమిక నిర్వహించిందన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారని తెలిపారు. వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసిందన్నారు.
1. ఆర్థిక వృద్ధి (Economic Growth): ఆవిష్కరణలు మరియు ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం.
2. సమ్మిళిత అభివృద్ధి (Inclusive Development): యువత, మహిళలు, రైతులు మరియు అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం.
3. సుస్థిర అభివృద్ధి (Sustainable Development): అన్ని రంగాలలో సుస్థిరతను పొందుపరచడం మరియు 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం.
4. సాంకేతికత & ఆవిష్కరణ (Technology & Innovation): పాలన, పరిశ్రమలు మరియు సేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
5. సమర్థవంతమైన ఆర్థిక వనరులు (Efficient Financing): పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం.
6. సుపరిపాలన (Good Governance): పారదర్శక, జవాబుదారీ మరియు పౌర-కేంద్రీకృత పాలనను అందించడం.
















