ఢిల్లీ : అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, ఐటీ సెల్ వింగ్ ఇంఛార్జి అమిత్ మాలవీయ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ భారత క్రికెట్ జట్టు ఆటగాడు అయిన నవజ్యోత్ సింగ్ సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ చేసిన కామెంట్స్ పట్ల తీవ్రంగా స్పందించాడు. తను ఇటీవలే కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. ప్రధానంగా తమ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే దాదాపు రూ. 500 కోట్లకు పైగా డబ్బులు సమర్పించు కోవాల్సి ఉంటుందన్నారు.
అలా చెల్లింపులు చేసిన వారికే సీఎం పోస్టు దక్కుతుందని సంచలన ఆరోపణలు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు అమిత్ మాలవీయ. ఇవి సమకూర్చితేనే పదవి దక్కుతుందని, అన్ని డబ్బులు తమ వద్ద లేవని పేర్కొనడం కాంగ్రెస్ పార్టీలో అవినీతి, అక్రమాలు ఎలా చోటు చేసుకుంటున్నాయో తెలిసి పోయిందన్నారు మాలవీయ. అంతే కాకుండా గతంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆరోపణలు గతంలో వచ్చాయన్నారు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా జవాబుదారీతనం, స్పష్టత చాలా అవసరం అన్నారు.

















