విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయనే విషయంపై ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారని కానీ వీరి వల్ల ఒక్క పైసా రాష్ట్రానికి లాభం చేకూరలేదన్నారు. వీరిని ఎందుకు ఎన్నుకున్నారనే విషయం వారికైనా తెలుసా అని ప్రశ్నించారు. కానీ నేటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదంటూ నిలదీస్తున్నారని అన్నారు.
బీజేపీ 11 సంవత్సరాలుగా అమలు చేయక పోయినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలపై తమ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే మా ఎంపీలు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినవారు. కానీ వాస్తవానికి వారందరూ బీజేపీ కేడర్ అని పేర్కొన్నారు. వారందరూ బీజేపీ చేతుల్లో రబ్బరు స్టాంపులుగా మారి పోయారని ఆరోపించారు షర్మిలా రెడ్డి. వారు చేసేదల్లా బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు తల ఊపడం తప్పా మరోటి కాదన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన ఏ హామీకి వారు ఎప్పుడూ మద్దతు ఇవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన ప్రధాన వాగ్దానాలలో ప్రత్యేక హోదా ఒకటి. ఈ హామీ ఇచ్చి 11 సంవత్సరాలు అయింది. ప్రధాని మోదీ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారని, కానీ ఏనాడూ దాని గురించి ప్రస్తావించడం లేదన్నారు.

















