అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం ఉప్పాడ ప్రాంతం సమస్యపై దృష్టి సారించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన జరిపిస్తామన్నారు. మీ అందరికీ అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. తమిళనాడు, కేరళకు అధ్యయనం కోసం ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పంపిస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తీసుకు వచ్చారంటూ ఆవేదన చెందారు పవన్ కళ్యాణ్.
ప్రజా ధనం నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ప్రతిఫలం ఉండాలని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి పని చేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు.. అప్పటి ప్రభుత్వం ఓ ప్రణాళిక లేకుండా, సొంత ప్రాపకాల కోసం ఇష్టానుసారం చేసిన ఖర్చులతో నిధులు అక్కరకు రాకుండా పోయాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం. పోలవరం డయా ఫ్రం వాల్ ను గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు మార్చి, రివర్స్ టెండర్లు అంటూ ఇష్టానుసారం నిర్మించడంతో ఎందుకు పనికి రాకుండా పోయిందని, తీరా ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే ఉప్పాడలో నిర్మించిన మత్స్యకారుల జెట్టీ కూడా డిజైన్ల లోపం కారణంగా పనికి రాకుండా పోయిందన్నారు. వాళ్ల నిర్లక్ష్యం కారణంగా తిరిగి రూ. 80 కోట్లు చేయాల్సి వస్తోందన్నారు పవన్ కళ్యాణ్.

















