Pawan Kalyan : అమరావతి : చిత్తడి నేలల సంరక్షణ భావితరాల భవిష్యత్తుకు అత్యంత అవసరమని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటికే 16 చిత్తడి నేలలను గుర్తించి, వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున చిత్తడి నేలలకు గుర్తించిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించ బోతోందని పేర్కొన్నారు. అందులో సోంపేట, తవిటి మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో విస్తరించి వున్న మూడు చిత్తడి నేలలను అనుసంధానిస్తూ భారీ పర్యాటక ప్రాజెక్టుకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు.
Deputy CM Pawan Kalyan Key Comments
కొల్లేరు మాదిరిగా మరిన్ని చిత్తడి నేలలకు రాంసర్ గుర్తింపు దక్కేలా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని చెప్పారు. సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలకు లోబడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల భౌగోళిక గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,450 చిత్తడి నేలలు ఉన్నాయని అన్నారు. అందులో 99.3 శాతం నేలలకు డిజిటల్ సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు పవన్ కళ్యాణ్. వీటికి ఈ నెల 28 లోపు భౌతిక సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు. అందుకోసం అటవీ శాఖ, రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి ఆ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అన్నారు.
చిత్తడి నేలల గుర్తింపు, అభివృద్ది ప్రక్రియలో అన్ని రాష్ట్రాల కంటే మనం ముందున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో ఒకేసారి 16 చిత్తడి నేలలకు టెక్నికల్, గ్రీవెన్స్ కమిటీ ఆమోదం లభించిందన్నారు. వీటిని అధికారికంగా గుర్తిస్తూ నోటిఫై చేయబోతున్నామని ప్రకటించారు. అందులో సోంపేట, తవిటి మండలాల పరిధిలో 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద బీల, చిన బీల, తుంపర, చిత్తడి నేలలను ఒక కారిడార్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
Also Read : KTR Interesting Comments on KCR : మెడికల్ డివైసెస్ పార్క్ కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం
















