Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హరీశ్ రావు (Harish Rao) మీడియాతో మాట్లాడారు. కాగా నెలల తరబడి టీవీవీపీ, బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. మాటల్లో ఫేకుడు ఢిల్లీకి వెళ్ళి జోకుడు , పథకాల్లో కోతలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు హరీశ్ రావు. టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం అన్నారు.
MLA Harish Rao Demand
ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరించింది లేదు, అమలు చేసింది లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలు అందని దుస్థితి దాపురించిందన్నారు హరీశ్ రావు. ఇక బస్తీ దవాఖాన వైద్య సిబ్బందికి అయితే ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టి, చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైద్యులకు, ఇతర సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగ సంబురం లేకుండా చేసి, వారిని మానసిక క్షోభకు గురి చేయడం తగునా అని ప్రశ్నించారు. వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోక పోవడం దుర్మార్గం అన్నారు.
Also Read : BRS Party Sensational Protest : 9న బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్

















