ONGC : ప్రభుత్వరంగ సంస్థ ఓయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు అన్వేషణను మరింత వేగవంతం చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ భూభాగ ప్రాంతాల్లో 172 కొత్త బావులు తవ్వడానికి సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్పై రూ.8,110 కోట్ల పెట్టుబడి అంచనా వేయబడింది.
ONGC Huge Investment
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ (ఎంఈఎ్ఫసీసీ) ఈ ప్రణాళికకు పచ్చజెండా ఊపింది. కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీకి కేటాయించిన ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (పీఎంఎల్) బ్లాకుల్లో ఈ తవ్వకాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) కోసం రూ.172 కోట్లు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం రూ.11 కోట్లు కేటాయించనున్నారు.
ONGC – పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక షరతులు
ఎంఈఎ్ఫసీసీ తవ్వకాల అనుమతి ఇస్తూనే పర్యావరణ భద్రతపై కఠిన నియమాలు విధించింది. కోరంగి వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి పది కిలోమీటర్ల పరిధిలో ఏ బావి తవ్వకూడదని స్పష్టం చేసింది. అలాగే అటవీ, సంరక్షిత ప్రాంతాల గుండా పైప్లైన్లు వేయడానికి ముందు ప్రత్యేక అనుమతి తప్పనిసరి అని షరతు విధించింది. కోనసీమ ప్రాంతంలో చమురు తవ్వకాల కారణంగా భూమి కుంగిపోతుందన్న నిపుణుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
కేజీ బేసిన్లో విస్తారమైన నిక్షేపాలు
అంచనాల ప్రకారం కేజీ బేసిన్లో సుమారు 69.8 కోట్ల టన్నుల చమురు, వాయువు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు పరిమాణం కంటే దాదాపు రెండింతలు ఎక్కువ. దీంతో ఓఎన్జీసీ (ONGC), రిలయన్స్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో విస్తృతంగా అన్వేషణ చేపడుతున్నాయి. రిలయన్స్ ఇప్పటికే లోతట్టు సముద్ర ప్రాంతాల్లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించగా, ఓఎన్జీసీ కూడా 500 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రయోగాత్మక ఉత్పత్తి నిర్వహిస్తోంది. ఇప్పుడు ఉపరితల ప్రాంతాల్లోనూ బావులు తవ్వి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలనే ప్రణాళికలో ఉంది.
భారతదేశంలో చమురు గిరాకీ పెరుగుదల కొనసాగనుంది
పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్నా, భారతదేశంలో చమురు వినియోగం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రోజుకు 54 లక్షల బ్యారళ్ల డిమాండ్ ఉండగా, 2050 నాటికి అది 91 లక్షల బ్యారళ్లకు చేరే అవకాశం ఉందని బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) ప్రధాన ఆర్థికవేత్త స్పెన్సర్ డేల్ అంచనా వేశారు. అంతేకాక, దేశంలో సహజ వాయువు అవసరం కూడా రెండింతలు పెరిగి 15,300 కోట్ల ఘన మీటర్లకు చేరుతుందని తెలిపారు.
వచ్చే పాతికేళ్లలో ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద స్థాయిలో చమురు వినియోగం పెరగదని ఆయన పేర్కొన్నారు. పునరుత్పాదక వనరుల ఉత్పత్తి ఎంత పెరిగినా, భారత ఇంధన వినియోగంలో చమురు ప్రాధాన్యం కొనసాగుతుందనే అంచనా వ్యక్తం చేశారు.
Also Read : Today Gold Price : రోజురోజుకు భారీగా పెరుగుతూ పోతున్న పసిడి ధరలు



















