హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే మహిళా సంఘాలకు స్థిరమైన ఆర్థిక సౌలభ్యం కల్పించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలకు బస్సుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేసేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. ఇందులో భాగంగా 155 బస్సులు ఆర్టీసీకి సంఘాల తరపున అప్పగించింది. ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకుంది. ఒక్కో బస్సుకు సంబంధించి నెలకు కనీసం రూ. 69 వేలకు పైగా అద్దె వస్తుంది. దీని వల్ల ఆయా సంఘాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక అప్ డేట్ ఇచ్చారు బస్సుల గురించి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు 448 ఆర్టీసీ బస్సులను అప్పగించనుందని ప్రకటించారు. మహిళలకు సాధికారత కల్పించడం, వారి ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ మహిళలను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తుందని ఈ సందర్బంగా చెప్పారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులను నిర్ధారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతోందని అన్నారు. ప్రతి బస్సు నెలకు దాదాపు ₹70,000 అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తుంది, ఇది గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలకంగా మారుతుందన్నారు.















