హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా ఎన్ని నష్టాలు వచ్చినా తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుని తీరుతామన్నారు. ఆర్టీసీ మన కుటుంబం..దురదృష్టవశాత్తు మన కుటుంబ వ్యక్తి దూరం కావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం వారి సమస్యల పై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించు కోవడానికి అంగీకరిచడం జరిగిందన్నారు మంత్రి. ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించిందన్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విలీనం పై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కి నాయకత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు , వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎస్ ,అధికారుల బృందం ఆర్టీసీ జేఎసి తో చర్చలు జరిపిందని చెప్పారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఉదయం ఐ ఏ ఎస్ లతో చర్చలు జరిపి తరువాత ఉప ముఖ్యమంత్రితో వారి సమస్యల పై సమాలోచనలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు , ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే అంశాలపై చర్చించినట్లు చెప్పారు పొన్నం ప్రభాకర్. తమ ముందు ఆర్టీసీ సంఘాల నేతలు మొత్తం 32 డిమాండ్లు పరిష్కరించాలని కోరారని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించామన్నారు పొన్నం.
















