అహ్మదాబాద్ : కథ ముగిసింది. ఇండియా ఎట్టకేలకు చరిత్రను తిరగ రాసింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ లో న్యూజిలాండ్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ సందర్బంగా భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మీడియతో మాట్లాడాడు. కేరళ స్టార్ సంజు శాంసన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. తను లేక పోతే ఇవాళ మీ ముందు నేను మాట్లాడి ఉండేవాడిని కానని పేర్కొన్నాడు. తన వల్లనే భారత్ భారీ స్కోర్ సాధించ గలిగిందని చెప్పాడు. విండీస్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో తను ఒంటరి పోరాటం చేశాడని, పోతుందని అనుకున్న మ్యాచ్ ను ఒంటి చేత్తో 97 పరుగులు చేసి , చివరి దాకా ఉండి ఇండియాను సెమీ ఫైనల్ కు చేర్చాడని అన్నాడు కెప్టెన్.
అంతే కాదు ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ లో 89 రన్స్ చేశాడని, తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సైతం తను కీలక పాత్ర పోషించాడని కితాబు ఇచ్చాడు. కీలకమైన 89 రన్స్ తో ఆకట్టుకున్నాడని, తనతో పాటు అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్, చివరలో శివమ్ దూబే తమ వంతు పాత్ర పోషించారని, ఆ తర్వాత న్యూజిలాండ్ పతనాన్ని అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా శాసించారని చెప్పాడు సూర్య కుమార్ యాదవ్. ప్రపంచ కప్కు ముందు కష్టపడుతున్న సంజు శాంసన్ కూడా స్పందించాడు. ఇదంతా ఒక కలలాగా ఉందన్నాడు. తన జీవితంలో మరిచి పోలేని క్షణాలు అని పేర్కొన్నాడు.
