హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి మంత్రి పదవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. శాసన సభ సమావేశాల సందర్బంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ మధ్యన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. తాజాగా మరో సన్నివేశానికి కేంద్రంగా మారింది అసెంబ్లీ ప్రాంగణం. భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో గంటకు పైగా సమావేశం అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి వచ్చినా రాక పోయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని స్పష్టం చేశారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల సమయంలో మేము అన్నదమ్ములమని తెలియదా అని ప్రశ్నించారు. ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పై బాంబు పేల్చారు. ఆయననే టార్గెట్ చేశారు. నల్గొండలో అనేక ఎన్నికల్లో ఛాలెంజ్ చేసి నిలబడ్డానని గుర్తు చేశారు. ఆనాడు అందరినీ నయీం భయపెడితే తాను తొణకలేదని అన్నారు. మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే చేస్తానని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
తమ పార్టీకి చెందిన వారిలో కొందరు కావాలని తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ములం అయినంత మాత్రాన పదవులు ఇవ్వకూడదని ఏమైనా రూల్ ఉందా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.


















