హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఇక్కడ ఏం పని అని ప్రశ్నించారు. ఏపీలో చూసుకుంటే బెటర్ అని పేర్కొన్నారు. ఇక్కడ మతం పేరుతో, కులం పేరుతో విద్వేషాలు సృష్టించేందుకు వస్తున్నావా అని మండిపడ్డారు. తను పవన్ కళ్యాణ్ కాదని దిష్టి కళ్యాణ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కు ఇక్కడ ఏం పని ఉందని వస్తున్నాడని ప్రశ్నించారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారంటూ నిలదీశారు టీపీసీసీ చీఫ్. బీజేపీ నేతల కంటే మేమే ఎక్కువ పూజలు చేస్తాం అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రాకు అందలం ఎక్కించారని, తెలంగాణకు మంగళం పాడారని ఆరోపించారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని నేతలు ఎలా పర్యటిస్తారంటూ నిలదీశారు. స్థానిక ఇన్ఛార్జ్ మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. మా పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పొరపాటు చేశారని, వాటిని సరిదిద్దు కోవాలని సూచించానని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్.

















