హైదరాబాద్ : తమ నాయకుడు , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిల్లర రాజకీయాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణను నాశనం చేసే పనిలో బిజీగా ఉన్నాడని ధ్వజమెత్తారు. అయినా కొంత కాలం ఓపికతో చూస్తారని ఆ తర్వాత తిరగబడటం ఖాయమని అన్నారు జగదీశ్ రెడ్డి. ఇదే సమయంలో ఆంధ్రాకు చెందిన మీడియా సంస్థలు నోటికి వచ్చినట్లు , ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేస్తున్నాయని, తలతిక్క రాతలు రాస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మీరు రాసిన రాతలతో ఎన్ని కుటుంబాలు క్షోభపడ్డాయో అందరికీ తెలుసు అని అన్నారు. ఆనాడు కేసీఆర్ క్షమాభిక్షతో చాలా మంది బ్రతికిపోయారని, అయినా ఏబీఎన్ రాధాకృష్ణకు సిగ్గు రాలేదన్నారు. ఒక మంత్రి వల్ల ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఏ ఆధారాలతో రాశావో బయటకు చెప్పాలని నిలదీశారు జగదీశ్ రెడ్డి. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఈ అంశంపై కూడా ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిట్ తో విచారణ జరిపించాలని అన్నారు.
