అమరావతి : ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిష్కరిస్తామని, పంటలు కోల్పోయిన రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. బుధవారం శాసన సభలో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై ప్రశ్నించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గత , ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 6000 ఎకరాల్లో పంటలు మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభావిత రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, సముద్ర మట్టం పెరుగుదల, భూమి కుంగి పోవడం, డ్రైనేజ్ నీటిలో ఉప్పు శాతం పెరగడం వంటి కారణాల వల్ల సుమారు లక్ష ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
వేలాది కొబ్బరి చెట్లు ఎండిపోయి పాడైపోయాయని పేర్కొన్నారు. టెక్నికల్ కమిటీ నివేదికల ఆధారంగా ఈ సమస్యను ప్రకృతి విపత్తుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. లైడార్ సర్వే కూడా జరుగుతోందని తెలిపారు. దీనికి సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లుగా డ్రైనేజ్ అభివృద్ధికి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించక పోవడం వల్ల పరిస్థితి మరింత విషమించిందని పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రాజెక్ట్ రూపంలో తీసుకుని సర్వే చేయడానికి రూ.17 కోట్లు విడుదల చేశామన్నారు.
















