అమరావతి : ప్రతీ కార్యకర్తను నాయకుడిగా తయారు చేస్తామని ప్రకటించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్ల శిక్షణా తరగతులకు హాజరయ్యారు. క్లస్టర్ ఇన్ఛార్జులతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించారు ముఖ్యమంత్రి.
పార్టీ సిద్దాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై క్లస్టర్ ఇన్ఛారీలతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రతీ కార్యకర్తను నాయకుడిగా తయారు చేస్తామని, కేడర్ దాన్ని అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు. సమకాలీన రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించు కోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ చేస్తున్న అరాచకాల గురించి వివరించారు.
ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్సుతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. అవకాశాలను ఉపయోగించుకుని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని కోరారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని అన్నారు సీఎం. సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. 2019లో వైసీపీ గెలిచింది… రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిందన్నారు. నన్ను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా కార్యకర్తలను కాపాడుకున్నానని అన్నారు.
