విజయవాడ : విజయవాడను దేశంలోనే నెంబర్ వన్ నగరంగా మారుస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్ని. గత ఐదు సంవత్సరాలుగా విజయవాడ నగర అభివృద్ధిని అడ్డుకున్న వి.ఎం.సి వైసిపి కౌన్సిల్ సమయం త్వరలో ముగియనుందని అన్నారు. దీంతో నగరానికి పట్టిన చెద, పీడ విరగడ కానుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. నగర పాలక సంస్థకు కేంద్ర 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ద్వారా రూ.1.48 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను బుధవారం గురునానక్ కాలనీలోని మెయిన్ రోడ్ లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆ మొబైల్ మిషన్ పని తీరును గమనించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఈ మిషన్ను నగర రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణలో విస్తృతంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ఇక నగరాభివృద్ధికి సంబంధించి ఏ ప్రతిపాదన వచ్చినా వైసిపి కౌన్సిల్ తిరస్కరిస్తోందన్నారు. గత ఐదేళ్లుగా వి.ఎం.సి కౌన్సిల్ లో టిడిపి నాయకులు, కార్పొరేటర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులు రాజకీయ కారణాలతో నిలిచి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్ల నిధులు కేటాయిస్తే…ఆ ప్రతిపాదనను కూడా వైసిపి కౌన్సిల్ రిజెక్ట్ చేసిందని ఆరోపించారు ఎంపీ కేశినేని చిన్ని. .నగర అభివృద్ధికి అడ్డుగా వున్న ఈ వైసిపి కౌన్సిల్ సమయం దగ్గర పడటంతో, త్వరలో రద్దు కానుందన్నారు. రాబోయే కొత్త కౌన్సిల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ వ్యవస్థలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు
