అమరావతి : రాష్ట్రంలో ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం శాసన మండలిలో ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రాజెక్టుల పురోగతిపై శాసన మండలి సభ్యులు ప్రశ్నలు సంధించారు. నేరడి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టుల పురోగతి పై స్పందించారు. శ్రీకాకుళం జిల్లా లో వంశధార నది నుండి 34 టిఎంసిల నీటిని వినియోగించుకునేలా నేరడి బ్యారెజిని రూపొందించడం జరిగిందన్నారు నిమ్మల రామానాయుడు. నేరడి బ్యారేజి కి సంబందించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.
ఒడిశా రాష్ట్రంతో వివాదాన్ని పరిష్కరించేలా ఇటీవలే సిఎం చంద్రబాబు కేంద్రజలశక్తి మంత్రిని కలిశారని చెప్పారు నిమ్మల రామానాయుడు. నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలుగా, ట్రిబ్యునల్ తీర్పును త్వరగా అధికారిక గెజిట్లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిని కోరామన్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు, కేసీ కెనాల్ కు, సాగు నీరందించేలా తుంగభద్ర నదిపై 20 టీఎంసీ ల నీటి నిల్వ సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదన చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 2890 కోట్లతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు మంత్రి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమ్మతి తీసుకునేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు నిమ్మల రామానాయుడు.

















