అమరావతి : బీసీ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచే ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత ,జౌళి శాఖ మంత్రి సవిత సంచలన ప్రకటన చేశారు శాసన సభ సాక్షిగా. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో విద్యనభ్యసించే బీసీ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు మంత్రి. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. బీసీ హాస్టళ్లలో చదవే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. 2014-19లో తరగతల వారీగా మెస్ ఛార్జీలు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
3,4 తరగతులకు 33 శాతం ఛార్జీలు, 5-7 తరగతి పిల్లలకు 67 శాతం, 8-10 తరగతి విద్యార్థులకు 47 శాతం, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు 33 శాతం మేర మెస్ ఛార్జీలు పెంచామన్నారు ఎస్. సవిత . బీసీ హాస్టళ్ల మెస్ ఛార్జీల పెంపు ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇదే విషయమై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించినట్లు తెలిపారు. హాస్టళ్లలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఏ రకమైన పోషకాహారం అందించాలనే విషయమై న్యూట్రిషన్ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు ఎస్. సవిత. దానికి అనుగుణంగా మెస్ ఛార్జీల పెంపు ఆలోచన చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
