హైదరాబాద్ : రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలకు సిద్ధం అవుతుందని వెల్లడించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ చివరి నాటికి అవి పూర్తవుతాయని తెలిపారు. ఎక్స్-రే మరియు సిటి స్కాన్ యంత్రాలతో సహా వైద్య పరికరాల ఏర్పాటు సెప్టెంబర్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నామన్నారు మంత్రి. నవంబర్ నుండి ట్రయల్ రన్లు నిర్వహించాలని, డిసెంబర్లో ప్రారంభోత్సవానికి ఆసుపత్రిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు దామోదర రాజ నరసింహ. ఇవాళ తన అధ్యక్షతన రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల పురోగతిపై సమీక్ష చేపట్టారు.
అల్వాల్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమవుతుందని, ఎల్బీ నగర్ యూనిట్ 2027 మార్చి నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. వరంగల్ ఆసుపత్రిని ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించేలా వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు; అలాగే పనులను పూర్తి చేయడానికి రోడ్లు , భవనాల శాఖ కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మరో సమీక్షలో గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా , ఇతర సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన పేర్కొన్నారు మంత్రి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు టైఫాయిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయని గమనించారు. అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లో జ్వర సర్వేలు, దోమల నియంత్రణ చర్యలు , నిఘాను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. తగినంత మందులు, డయాగ్నస్టిక్ కిట్లు , పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఆసుపత్రులను కోరారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో ఇన్ఫ్లుయెన్జా వంటి అనారోగ్య కేసులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

















