విశాఖపట్నం జిల్లా : గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా మారుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. మంగళవారం గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో నిర్మించిన సైబర్ టవర్ ఐటీకి ఐకానిక్ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోందని అన్నారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయని చెప్పారు. ఎంఓయూ చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరుగుతోందన్నారు. ఏఐ డేటా సెంటర్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునే రోజు దగ్గర్లోనే ఉందన్నారు అశ్విని వైష్ణవ్.
ఐటీ సేవల రంగంలో భారత్ లీడర్ గా ఎదిగిందన్నారు. మన దేశంలోని నాయకత్వం కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. గతంలో ఉత్పత్తి రంగంపై భారత్ ముందుకు వెళ్లలేక పోయిం.దన్నారు.
సెమీ కండక్టర్లు, చిప్, ల్యాప్ టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం అని వాపోయారు. అయితే ప్రధాని మోదీ చొరవతో మొబైల్ మాన్యు ఫాక్చరింగ్ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశాం అని చెప్పారు. భారత్ నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్ అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. దేశీయంగా అవసరమైన 50 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాం అన్నారు. మేజర్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్, డిజైన్ చేసే దేశంగా భారతదేశాన్ని గుర్తించాలన్నారు. సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా ఇప్పటికే వాణిజ్య పరమైన ఉత్పత్తిని ప్రారంభించామని వెల్లడించారు.
