Venkaiah Naidu : హైదరాబాద్ – మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కోట శ్రీనివాస రావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబీకులను ఓదార్చారు. కోట మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. నటుడిగా భిన్నమైన పాత్రలు పోషించారని, రాజకీయాలలో అజాత శత్రువుగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఇలాంటి నటుడు మళ్లీ పుట్టడని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Venkaiah Naidu Comments
నివాళులు అర్పించిన అనంతరం వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) మీడియాతో మాట్లాడారు. తనకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. ఎన్నో విలక్షణమైన పాత్రలలో, ఆకట్టుకునే నటనతో తెలుగుతో పాటు అనేక భారతీయ భాషలకు చెందిన ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నారు. సహజ సిద్ధమైన హావభావాలు, పాత్రకు తగిన వాక్చాతుర్యంతో చలనచిత్ర సీమలో తనదైన ముద్ర వేశారని చెప్పారు. తెలుగు భాష పట్ల వారికున్న అభిమానం, భాష పై వారికున్న పట్టు ప్రత్యేకమైనవని అన్నారు. పాత్రకు తగిన విధంగా చక్కని విరుపులతో, మాండలిక పదాలతో వారి సంభాషణలు మంత్రముగ్ధుల్ని చేశాయన్నారు.
నటునిగానే కాకుండా, భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యునిగా కోట శ్రీనివాసరావు అందించిన సేవలు అమూల్యమైనవని అన్నారు వెంకయ్య నాయుడు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం సహా, చలనచిత్ర రంగంలో వారు అందుకున్న అవార్డులు ఆయన నటనా వైదుష్యానికి తార్కాణాలు అని పేర్కొన్నారు.
Also Read : Nagababu – Kota Death : అసాధారణమైన నటుడు కోట శ్రీనివాస రావు



















