Harish Rao : హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ పై. ఉన్నట్టుండి ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు వాహనాలకు సంబంధించిన లైఫ్ ట్యాక్స్ ను భారీగా పెంచడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పన్నుల భారం వేసి పేద ప్రజల రక్తం పీల్చాలని చూస్తున్న కాంగ్రెస్ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఆదాయం సమకూర్చు కోవడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని భట్టి చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు హరీశ్ రావు (Harish Rao). జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టడం తప్ప మరోటి కాదన్నారు.
Harish Rao Slams Telangana Govt
ఈరోజుల్లో ఏ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినా లక్ష దాటి ఉంటోందన్నారు. రైతులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను వృత్తి, ఉపాధి పరంగా కొనుగోలు చేస్తుంటారని తెలిపారు మాజీ మంత్రి. లక్ష దాటిన ద్విచక్ర వాహనాలపై లైఫ్ టాక్స్ను 12 శాతం నుంచి 15 శాతానికి పెంచడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు తన్నీరు హరీశ్ రావు (Harish Rao). బైక్ ఎక్స్ షోరూం ధర రూ. లక్షా 10 వేలు ఉంటే, ఇప్పటి వరకు రూ. 13,200 లైఫ్ టాక్స్ కట్టాల్సి ఉండేదన్నారు. తాజా పెంపుతో ఇది రూ. 16,500 లకు పెరుగుతుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారాన్ని పేద, మధ్య తరగతి ప్రజలపై కాంగ్రెస్ వేస్తున్నదని పేర్కొన్నారు.
కారు కొనుక్కోవాలనేది సాధారణంగా ఎవరికైనా ఉండే కోరిక అని, అప్పు చేసో, లోన్ తీసుకొనో మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తుంటారని, వారి ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు హరీశ్ రావు (Harish Rao). రూ. 10 లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి కార్ల మీద కూడా లైఫ్ టాక్స్ వేసి ప్రజల కోరికలను ఆసరాగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి కొల్లగొట్టే ప్లాన్ కు తెర తీశాడన్నారు . రూ. 10-20 లక్షల కారు కొంటే 17 శాతంగా ఉన్న పన్ను శాతాన్ని 18 శాతానికి పెంచాడని ఆరోపించారు. అంటే దాదాపు రూ. 20 వేల అధిక భారం కొనుగోలు దారులపై కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నదని అన్నారు.
రూ. 20 లక్షలు దాటితే రెండు శాతం, రూ. 50 లక్షలు దాటితే మూడు శాతం పెంచడం దారుణమన్నారు.
వీటితో కాకుండా కమర్షియల్ వాహనాల పన్నులు కూడా పెంచాడని ఆరోపించారు. రూ. 20 లక్షల పైగా ఉంటే 20 శాతంగా ఉన్న పన్నును 22 శాతానికి, రూ. 50 లక్షలు దాటితే 25 శాతం పన్ను కట్టాలని నిర్ణయించాడని ధ్వజమెత్తారు. కమర్షియల్ వెహికిల్స్పై పన్ను పెంచడం వల్ల, చివరకు అది మార్కెట్పై, ప్రజలపైనే ఆ భారం కూడా పడుతుందన్నారు. హ్యామ్ మోడల్ పేరిట రోడ్లను ప్రైవేటు కంపెనీలకు 15 నుంచి 20 సంవత్సరాల వరకు అప్పజెప్పే నిర్ణయం జరిగిందన్నారు.
Also Read : PM Modi Warning to Pakistan : అణుబాంబు బెదిరింపులకు భయపడం : మోదీ


















