హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి వివాదం ముగిసిన అంశమని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యడమే మా లక్ష్యం అన్నారు. ప్రధానమంత్రి చేయాలంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి టీమ్గా పనిచేస్తే పార్టీకి మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. రాజగోపాల్ రెడ్డితో సమావేశంలో తుంగతుర్తి అంశం ప్రధాన ఎజెండా కాదన్నారు. తుంగతుర్తి స్థానిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారన్నారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులే తుంగతుర్తి సమస్యను పరిష్కరించు కోవాలని పేర్కొన్నారు జగ్గారెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి కీలక నాయకుడని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల్ రెడ్డి పోరాటం చేశారని, రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన అండగా నిలిచారని మరోసిరా గుర్తు చేశారు జగ్గారెడ్డి. ప్రస్తుతం జరిగిన సమావేశం లో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల పై మాట్లాడామన్నారు మీడియాతో.



















