హైదరాబాద్ : నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో నడుస్తున్న జె.బి.ఎమ్ ఎలక్ట్రిక్ బస్సులలో (JBM e-Buses) వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణీకుల భద్రతను దృష్ట్యా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జె.బి.ఎమ్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలిక నిలిపివేతకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. గత నెల జూన్ 21వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్ సమీపంలో అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదం పై పూర్తి నివేదిక రాక మునుపే మరొక సంఘటన జరిగింది. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది , ప్రజల ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యతగా భావించి, తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
తెలంగాణ ఆర్టీసీ జేబీఎం సంస్థను ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై స్పందించి తగు నివేదిక సమర్పించ వలసిందిగా కోరడం జరిగిందని తెలిపింది టీజీఎస్ఆర్టీసీ. ఆర్టీసీ విజ్ఞాపన పై స్పందించిన జె.బి.ఎమ్ సంస్థ పైన పేర్కొన్న పలు అంశాల పైన తక్షణమే నివేదికలు, సిద్ధం చేసేందుకై వారి టెక్నికల్ టీం, చైనా నుంచి బ్యాటరీ నిపుణుల బృందం కూడా ప్రమాద పరిస్థితులు వాటికి దారి తీసిన సందర్భాలను పరిశీలించి పలు నివారణ చర్యలపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
భద్రతా ప్రమాణాలు , సంబంధిత నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, సంస్థ నిర్దేశించిన అన్ని షరతులను జె.బి.ఎమ్. యాజమాన్యం పూర్తిగా పాటించినట్లు సంతృప్తి చెందిన పిదప, వారి టెక్నికల్ బృందం “Vehicle Fit for Operation” అని ధృవీకరించిన వాహనాల పునరుద్ధరణ పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

















