నిజామాబాద్ జిల్లా : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయనకు సోయి అన్నది లేకుండా పోయిందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. ప్రధానంగా కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేనే లేదన్నారు టీపీసీసీ చీఫ్. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు.. గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం కారణంగా తమకు రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేతికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు లోపాయికారీగా బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లనే కేసీఆర్ ఇష్టానుసారంగా రెచ్చి పోయాడని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. ఒక వైపు వేల కోట్ల రూపాయలు వడ్డీల రూపేణా చెల్లిస్తున్నామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు నిజామాబాద్ లో. ఓ వైపు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అయినా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు కావాలని తమ సర్కార్ ను బద్నాం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

















