తిరుపతి జిల్లా : తిరుపతి ఎంపీ గురుమూర్తి పలు అభివృద్ది పనులకు తన కోటా నుంచి నిధులు మంజూరు చేశారు . ఇందులో భాగంగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కోట క్రాస్ రోడ్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి గురుమూర్తి రూ.5 లక్షల తన కోటా కింద నిధులు మంజూరు చేశారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్ షెల్టర్ను తొలగించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలగించిన బస్ షెల్టర్ తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకోక పోవడంతో రోడ్డు మీదే నిలబడి గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. దీనిని స్వయంగా గమనించారు ఎంపీ గురుమూర్తి.
కాగా మూడు మండలాలకు వెళ్లే కూడలి కావడంతో ఎప్పుడూ రద్దీ ఎక్కువగా ఉంటుందని సమస్య తీవ్రతను స్థానిక ప్రజలు, నాయకుల ద్వారా తెలుసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళి . ఈ మేరకు బస్ షెల్టర్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మద్దిల గురుమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీనిపై తిరుపతి ఎంపీ వెంటనే స్పందించారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డాయి. బస్ షెల్టర్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ఎంపీ గురుమూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు.
















