హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి కీలక ప్రకటన చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా నేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుంది. దీనిపై స్పందించారు సెంట్రల్ జోన్ డీసీపీ. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు డీసీపీ. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేయడం జరిగిందని చెప్పారు డీసీపీ. కాగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని అన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటికి వచ్చారని చెప్పారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. అయితే ఓటు నోటుకు సంబంధించిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇందులో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికాడు. తనను అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతోంది.
















