అమరావతి : వేసవి లో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్దరిoచాలని ఆదేశించారు. శనివారం విద్యత్ సీఎండీలతో మంత్రి గొట్టిపాటి రవి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారికంగా లేదా అనధికారికంగా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదన్నారు గొట్టిపాటి రవికుమార్.
సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోత విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం చెప్పటంతో పాటు వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వేసవి డిమాండ్ కు తగ్గట్టు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నా అక్కడక్కడా ఫిర్యాదులు ఎందుకు స్తున్నాయని ఆరా తీశారు మంత్రి. అధిక ఉష్ణోగ్రతల వల్ల పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్ లు కాలిపోవటం, అకాల వర్షాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు. ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పూర్తి అప్రమత్తంగా ఉండాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు .
