హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా, అత్యంత దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇప్పుడు చిల్లిగవ్వ లేదని, కాస్తా ఓపిక పట్టాలని సూచించారు ఎమ్మెల్యేలకు. ఈ సందర్బంగా ఆయన వారికి ఆర్థిక పాఠాలు చెబుతుండడం విస్తు పోయేలా చేస్తోంది. ప్రస్తుతం భట్టి చేసిన కామెంట్స్ చర్చకు దారితీసేలా చేశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని, ఖర్చులకు తగ్గ ఆదాయం లేదని పేర్కొన్నారు. ప్రతి నెలా ఆదాయ వ్యయాల మధ్య రూ. 2,200 కోట్ల వరకు వ్యత్యాసం ఉందన్నారు..కొత్త పథకాల అమలు సాధ్యమవడం లేదన్నారు. అంతే కాకుండా పాతవాటిని కూడా కొనసాగించ లేక పోతున్నాం అన్నారు.
అదనపు ఆదాయానికి మార్గాలేవీ కనిపించడం లేదు.. కొత్తగా రుణాలు తీసుకున్నా ఫలితాలు లేవని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. పరిస్థితి రోజురోజుకీ మారుతున్నట్లు అనిపిస్తోందని, మీరందరూ కాస్త సర్దుకు పోవాలని సూచించారు. కొద్దిపాటి రాజీ తర్వాత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో పరిస్థితిని వివరించాలని ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. ఆదాయాన్ని పెంచడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా ఎన్నికలకు ముందు ఆదాయానికి మించి హామీలు ఇచ్చారు . పవర్ లోకి వచ్చాక చేతులెత్తేశారు. ఆరు గ్యారెంటీలు పక్కా అన్నారు. చివరకు మహిళలకు ఉచిత బస్సు పథకం మాత్రమే అమలవుతోంది. ప్రస్తుత సర్కార్ పై రోజు రోజకు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.



















