అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్, వైసీపీ బ్యాచ్ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. వాళ్లలాగ దోచు కోవడం, దాచు కోవడం, నేరాలకు పాల్పడడం తమకు చేతకాదన్నారు. తాము ఏనాడూ అవినీతికి, అక్రమాలకు పాల్పడ లేదన్నారు. సీఎం చంద్రబాబు చూపిన మార్గంలో క్రమశిక్షణతో పయనిస్తూ, ప్రజాసేవకు అంకితమయ్యామన్నారు. జగన్ కు, వైసీపీ బ్యాచ్ కు బెదిరింపులకు పాల్పడడం అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలను, కాంట్రాక్టర్లను, అధికారులను, చివరికి ప్రజలను కూడా బెదిరిస్తూ, రాజకీయాలు చేస్తున్నారన్నారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ అసమర్థ పాలనను చూసి, ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తూ, ఉపాధి కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు మంత్రి సవిత. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రంతో పాటు తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని ప్రజల అభిప్రాయమన్నారు. సీఎం చంద్రబాబునే మళ్లీ మళ్లీ సీఎంగా చేసుకుందామని ప్రజలు డిసైడయ్యారన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అని మంత్రి సవిత స్పష్టం చేశారు.
