వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లను ఏకి పారేశారు. ఒక రకంగా అనరాని మాటలు అన్నారు. నోటికి వచ్చినట్లు తిట్టాడు. ఒక సీఎం స్థాయిలో ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. కానీ ఆయన తన నోటికి పని చెప్పారు. తాను ఉన్నంత వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేస్తానని, కేసీఆర్ , కేటీఆర్ లను రాజకీయాల్లో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇదే నా శపథం అని ప్రకటించారు కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో.నిండు మనసుతో మీరు ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకోవడం వల్లే ముఖ్యమంత్రి హోదాలో మీ ముందు నిలబడ్డానని అన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నానని ప్రకటించారు.
చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడే పార్టీలు, పంతాలు పట్టింపులు అని, ఇక ఎన్నికలు అయ్యాక వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోదామన్నారు. మన నియోజకవర్గంలో ఎవరిపై వివక్ష చూపొద్దని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు రేవంత్ రెడ్డి. గ్రామ కక్షలకు తావు లేకుండా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కొడంగల్ వేదికగా 12706 మంది సర్పంచులకు సూచన చేస్తున్నానని చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ అందిస్తానని ప్రకటించారు.
