ఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన స్పందించారు. అయితే ఈ విషయం నాకు తెలియదని అన్నారు. నా నాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు. ఇదే సమయంలో మాజీ చీఫ్ సోనియా గాంధీ తమకు ఇష్టమైన నాయకురాలని పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే ప్రియాంక గాంధీ ఏకైక లక్ష్యం అని స్పష్టం చేశారు డీకే శివకుమార్. తమ పార్టీకి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదన్నారు.
ఇది కావాలని చేయడం తప్పా మరోటి కాదన్నారు డిప్యూటీ సీఎం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దానిని బతికించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. కేంద్రం కావాలని బీజేపీ యేతర రాష్ట్రాలను కావాలని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తమ యువ, అగ్ర నేత తప్పకుండా భారత దేశానికి ప్రధానమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు డీకే శివకుమార్.
















