జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కొన్ని జిల్లాలను రద్దు చేస్తామని జరుగుతున్న ప్రచారం తప్పు అని పేర్కొన్నారు. అంతేకాకుండా సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయడం లేదని ప్రకటించారు. ఇదంతా కావాలని తమను డ్యామేజ్ చేసేందుకు జరుగుతున్న ప్రచారం తప్పా మరోటి కాదన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని చెప్పారు.
ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ వి ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచనలు చేస్తాం అన్నారు.
















