జర్మనీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు కేంద్ర సర్కార్ పై. రోజు రోజుకు దేశంలో ప్రజాస్వామ్యం నిరాదరణకు గురవుతోందని ఆవేదన చెందారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాను రాను సంస్థాగతంగా ఉన్న అన్ని సంస్థలను కావాలని నిర్వీర్యం చేస్తోందని, అంతే కాకుండా తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై పనిగట్టుకుని దాడి చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా’ వాడుకుంటోందని ఆరోపించారు. రాజకీయ అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి బీజేపీ సంస్థలను ఉపయోగించు కుంటోందని విమర్శించారు. ప్రధానంగా గూఢచార సంస్థలు, ఈడీ, సీబీఐలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని వారిని పని చేయకుండా నిరోధిస్తున్నారని వాపోయారు రాహుల్ గాంధీ. ఇన్నేళ్ల కాలంలో ఏనాడైనా ఈ దర్యాప్తు సంస్థలు భారతీయ జనతా పార్టీకి చెందిన వారిపై ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా రాజకీయ కేసులు వారికి వ్యతిరేకంగా ఉన్న వారిపైనే ఉన్నాయని, ఈ విషయం గుర్తించాలన్నారు.



















