హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బిఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.ఇదిలా ఉండగా కీలక సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని తెలిపారు తన్నీరు హరీశ్ రావు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం కేసీఆర్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా కీలక సమావేశం జరుగుతుందని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు , మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, బాధ్యులు పాల్గొంటారని తెలిపారు తన్నీరు హరీశ్ రావు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అర్ధాంతరంగా నిలిచి పోయిన ప్రాజెక్టులు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించడం జరుగుతుందన్నారు.
