హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. పాలన చేతకాక తమపై లేనిపోని ఆరోపణలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారందన్నారు. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను కచ్చితంగా 15 రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా మేము ప్రిపేర్ అవ్వకుండా రావడం లేదన్నారు. కచ్చితంగా ప్రిపేర్ అయ్యే వస్తామని స్పష్టం చేశారు.మీకు దమ్ము దైర్యం ఉంటే నేను మాట్లాడేటప్పుడు మీ మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డు పడవద్దని చెప్పాలన్నారు. రైతుబందు మీద, అసంపూర్ణ రుణమాఫీ మీద, HILT పాలసీ మీద, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల మీద, జాబ్ క్యాలెండర్ మీద, ఉద్యోగుల PRC, DA ల మీద, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ, హైడ్రా బుల్డోజర్ అరాచకాలమీద చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్ రావు.
2014 నుండి 2019 వరకు అత్యధిక అసెంబ్లీ సమావేశాలు నడిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. తమ హయాంలో ఒక్క సెషన్ 32 రోజులు నడిపిస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో కేవలం 40 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మీద బురద చల్లడానికే అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారే తప్పా ప్రజా సమస్యలపై చర్చ జరగపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాము లేవనెత్తిన ఏ ప్రజాసమస్య మీద కూడా చర్చలు జరపకుండా అడ్డు పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో 45 టీఎంసీలకు సంతకం పెట్టారా లేదా..సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.

















