హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసన సభ్యుల ను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం దురదృష్టకరం అన్నారు.
హైకోర్టు చెప్పినా లెక్క చేయకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమే తప్పా మరోటి కాదన్నారు హరీష్ రావు. ప్రతిపక్షం అంటే ఎందుకింత కక్ష, రేవంత్ రెడ్డి అని నిలదీశారు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22A భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అరెస్టులు కొనసాగుతున్నాయని అన్నారు.
మా మహిళా శాసన సభ్యుల చీరలు లాగారు.. గొంతు పిసికారు.. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఉల్టా మాపైనే కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా? అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. శాసన సభ్యుల ఇండ్ల ముందు ఎందుకు ఇంత మంది పోలీసులను పెట్టారు? ఎందుకు మా ఇళ్ళను చుట్టు ముట్టారని ఫైర్ అఅయ్యారు. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నావని మండిపడ్డారు.
